మనకు ప్రకృతిలో అనేక రకాల పూలు లభిస్తున్నాయి. వీటిలో గులాబీ పువ్వులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. సాధారణంగా మనలో అధిక శాతం మంది, ముఖ్యంగా మహిళలు, యువతులు గులాబీ అంటే ఎక్కువగా ఇష్టపడతారు. దీన్ని అనేక రకాల సౌందర్య సాధనాల్లో నేడు ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే గులాబీల ద్వారా తయారు చేసే రోజ్ వాటర్ కూడా మనకు ఉపయోగపడుతుంది. ఇది చర్మ సౌందర్యానికే కాకుండా శిరోజాల సంరక్షణకు కూడా ఉపయోగపడుతుంది. మరి రోజ్ వాటర్ వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. రోజ్ వాటర్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో వివిధ రకాల విటమిన్స్ కూడా ఉన్నాయి. ఇది యాంటీ సెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉంది. దీని కారణంగా ఇది గాయాలను, చిన్న చిన్న దెబ్బలను నయం చేయడానికి తోడ్పడుతుంది. 2. చర్మాన్ని కాంతివంతంగా మార్చే శక్తి రోజ్ వాటర్కు ఉంది. కళ్ల వాపులను తగ్గిస్తుంది.
సన్ బర్న్ అయితే ఆ ప్రదేశంలో కొంత రోజ్ వాటర్ను రాస్తే ఫలితం ఉంటుంది. 3. ముఖంపై ఏర్పడే మచ్చలను తొలగిస్తుంది. కీటకాలు కుట్టిన ప్రదేశంలో రోజ్ వాటర్ను రాస్తే వెంటనే ఉపశమనం కలుగుతుంది.
4. మహిళలు కళ్లకు వేసుకునే మేకప్ను రోజ్ వాటర్తో సులభంగా తొలగించుకోవచ్చు. రోజ్ వాటర్, జోజోబా ఆయిల్లను సమభాగాలుగా తీసుకుని కలిపి ఆ మిశ్రమాన్ని అప్లై చేసిన తరువాత గుడ్డతో తుడవాలి. 5. మొటిమలు ఉన్నా, చర్మం దురదగా ఉన్నా ఆ ప్రదేశంలో కొద్దిగా రోజ్ వాటర్ మిక్స్ చేసిన నీటిని రాయాలి.
ఇది ఇరిటేషన్ను తగ్గిస్తుంది. 6. జాస్మిన్ ఆయిల్లో కొద్దిగా రోజ్ వాటర్ను మిక్స్ చేసి శరీరానికి రాస్తే శరీరం నుంచి వెలువడే దుర్వాసన తగ్గుతుంది. 7. ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు రోజ్ వాటర్తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
రోజ్ వాటర్ కళ్ల కింద వాపు, డార్క్ సర్కిల్స్ వంటి వాటిని తగ్గిస్తుంది. ఒక కాటన్ బాల్ తీసుకుని రోజ్ వాటర్లో ముంచి వలయాకార కదలికలతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. మర్దనా చేయడం వల్ల చర్మంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. దీంతో చర్మం కాంతివంతంగా మారుతుంది.
8. తాజా కీరదోసను రసంగా చేసుకుని దాంట్లో టేబుల్ స్పూన్ రోజ్ వాటర్, కొన్ని పచ్చి పాలు కలిపి ఫ్రిజ్లో 15 నిమిషాల పాటు ఉంచాలి. అనంతరం దాంట్లో దూదిని ముంచి ముఖాన్ని తుడిస్తే మురికి తొలగిపోతుంది. ఇది సహజమైన టోనర్లా పనిచేస్తుంది.
9. చర్మం పీహెచ్ను రోజ్ వాటర్ బ్యాలెన్స్ చేస్తుంది. దీంతోపాటు చర్మం జిడ్డుగా మారకుండా చూస్తుంది. చుండ్రు నివారణకు రోజ్ వాటర్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
కేశాల సంరక్షణలో ఇది అద్భుతమైన పాత్రను పోషిస్తుంది. 10. రోజ్ వాటర్, అలోవెరా జెల్లను సమాన భాగాలుగా తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు అంటేలా బాగా రాయాలి.
ఇలా రాసిన తరువాత 10 నుంచి 15 నిమిషాల పాటు బాగా మసాజ్ చేయాలి. అనంతరం దాన్ని అలాగే ఒక అరగంట పాటు వదిలేయాలి. తరువాత షాంపూతో తలస్నానం చేయాలి. నెలకు 3 నుంచి 4 సార్లు ఇలా చేస్తే కుదుళ్లు దృఢంగా మారడమే కాకుండా, జుట్టు ప్రకాశవంతంగా మారుతుంది.
2,630 total views, 59 views today